పగలు డంపింగ్…. రాత్రి ఫిల్లింగ్…
అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా…
చోద్యం చూస్తున్న పోలీస్, రెవిన్యూ అధికారులు
అస్త్రం/బోధన్: నిజామాబాదు జిల్లా కేంద్రంతో పాటు బోధన్ నియోజకవర్గం లోని పలు గ్రామాలకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా,రాత్రి వేళల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు
జిల్లాలోని మంజీరా నదిలోనుండి సిద్దపూర్, కండ్ గావ్ గ్రామాల సరిహద్దుల నుంచి రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దును దాటుకోని రోజుకు పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా అర్ధరాత్రి నుంచి మొదలుకుని తెల్లవారుజాము వరకు ఇసుక వాహనాలు తరిలిపోతున్నాయి. పలు గ్రామాల శివారుల్లో వ్యాపారులు ఇసుకను నిల్వ చేసి రాత్రి వేళల్లో వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం.
గ్రామస్థులకు నిద్ర కరువు
ఇసుక వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి మొదలుకుని తెల్లవారుజాము వరకు జన సంచారం లేని సమయంలో యథేచ్చగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. రాత్రి వేళల్లో పలు గ్రామాలల్లోని కాలనీల నుంచి ఇసుక టిప్పర్లు వెళ్తున్నాయని, వాహనాల శబ్ధానికి నిద్ర పట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇసుక వాహనాలు ఓవర్ స్పీడ్తో వెళ్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల అవసరమే పెట్టుబడిగా
ఇసుక రవాణా సక్రమమే అయితే పగటి వేళల్లో తరలించకుండా రాత్రి వేళలో ఎందుకు తరలిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తూ వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో ఇంటి నిర్మాణ పనులు చేసుకోనే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని, ఇసుక వ్యాపారులు కాసులు గడిస్తున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.